పెన్షన్ సంస్కరణలు, సీపీఆర్ఎంఎస్ఈ బలోపేతానికి ఏఐఏసీఈ డిమాండ్.
విశ్రాంత బొగ్గు అధికారుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి.
హైదరాబాద్లో ఘనంగా ఏఐఏసీఈ వ్యవస్థాపక దినోత్సవం.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూన్ 12: బొగ్గు పరిశ్రమకు సేవలందించిన విశ్రాంత అధికారుల సంక్షేమం కోసం సమగ్ర పెన్షన్ సంస్కరణలు చేపట్టాలని, సీపీఆర్ఎంఎస్ఈ వైద్య పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కోల్ ఎగ్జిక్యూటివ్స్ (ఏఐఏసీఈ) అసోషియేషన్ డిమాండ్ చేసింది. ఏఐఏసీఈ హైదరాబాద్ శాఖ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం హైదరాబాద్లోని హోటల్ ది చట్నీస్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోల్ ఇండియా, సింగరేణి సంస్థలకు చెందిన విశ్రాంత అధికారులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎస్ఈసీఎల్ సీఎండీ బి.ఆర్. రెడ్డి, మాజీ ఎస్సీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) ఎ. మనోహర్ రావు మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏఐఏసీఈ చేస్తున్న కృషిని అభినందించారు. పెన్షనర్ల సంక్షేమం కోసం సంఘం చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఏఐఏసీఈ ప్రధాన కార్యదర్శి పి.కె. సింగ్ రాథోర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల నేపథ్యంలో బొగ్గు పరిశ్రమ పెన్షనర్లకు మెరుగైన ఆర్థిక భద్రత కల్పించేలా పెన్షన్ సంస్కరణలు అవసరమని అన్నారు. కోల్ మైన్స్ పెన్షన్ పథకానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సీపీఆర్ఎంఎస్ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి, వైద్య రీయింబర్స్మెంట్ పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. విశ్రాంత బొగ్గు అధికారుల అనుభవం, నైపుణ్యాన్ని భావితరాలకు అందించేందుకు “ఏఐఏసీఈ వర్చువల్ యూనివర్సిటీ” ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న విశ్రాంత అధికారుల మధ్య పరస్పర అనుబంధం, సమాచార మార్పిడిని పెంపొందించేందుకు “ఏఐఏసీఈ కోల్ క్లబ్” ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ పునర్వ్యవస్థీకరణ, వైద్య సదుపాయాల మెరుగుదల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఏఐఏసీఈ కట్టుబడి పనిచేస్తుందని సమావేశంలో తీర్మానించారు. బొగ్గు పరిశ్రమ అభివృద్ధికి సేవలందించిన విశ్రాంత అధికారుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని సభలో పాల్గొన్న వారు కోరారు.