అత్యవసర సేవల్లో అంకితభావానికి ప్రశంసాపత్రం.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేత.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
సత్తుపల్లి, ఆగస్టు 15: అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ ప్రాణాపాయంలో ఉన్నవారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో అంకితభావంతో సేవలందించిన వేంసూర్ 108 పైలట్ కొండ్రు రవికి జిల్లా స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 108 అత్యవసర సేవల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా కొండ్రు రవి ప్రశంసాపత్రం అందుకున్నారు. అత్యవసర సమయాల్లో క్షణం ఆలస్యం చేయకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో రవి చూపిన సేవాభావం, అంకితభావం, విధి నిర్వహణలో నిబద్ధతకు ఈ ప్రశంసాపత్రం గుర్తింపుగా నిలిచింది. వేంసూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కొండ్రు రవికి ఈ గౌరవం దక్కడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే అత్యవసర సేవల్లో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపు లభించడం గ్రామానికే గర్వకారణమని పేర్కొంటూ అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 108 సర్వీస్ ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్, 108 సర్వీస్ జిల్లా మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్ కొండ్రు రవిని అభినందించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలందించడంలో రవి చూపుతున్న నిబద్ధతకు ఈ పురస్కారం తగిన గుర్తింపని వారు పేర్కొన్నారు.