
అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో 5 రోజుల ఉచిత ఈఎన్టీ మెగా శిబిరం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 14: ప్రజలకు అత్యాధునిక ఈఎన్టీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వరంగల్లోని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐదు రోజుల ఉచిత ఈఎన్టీ సర్జరీ మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం యాజజమాన్యం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగనుంది. శిబిరంలో ప్రముఖ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ ఆర్. శ్రవణ్ కుమార్ పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా తగిన సలహాలు, సూచనలు అందించనున్నారు. చెవి నొప్పి, వినికిడి తగ్గడం, చెవిలో మోగుడు శబ్దం, తరచూ జలుబు, ముక్కు మూసుకుపోవడం, ముక్కు నుంచి రక్తస్రావం, గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, సైనసైటిస్, తీవ్రమైన తలనొప్పి తదితర సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. శిబిరంలో ఉచిత ఓపీ, ఉచిత ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించడంతో పాటు వినికిడి పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, ఇతర రక్త పరీక్షలపై 50 శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ ఆరోగ్య శిబిరం వరంగల్లోని కొత్తపేట క్రాస్ రోడ్, ఆరెపల్లి వద్ద ఉన్న అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో నిర్వహించబడుతుంది. వరంగల్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈఎన్టీ సమస్యలకు నిపుణులైన వైద్యుల నుంచి ఉచితంగా వైద్య సేవలు పొందాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. ముందస్తు అపాయింట్మెంట్, ఇతర వివరాల కోసం 94598 75555 నంబర్ను సంప్రదించాలని సూచించింది.