ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కారించాలి
– సీసీఎల్ ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

కామారెడ్డి జిల్లా, ఆగష్టు 03 ( లోకంతీరు) : ధరణి పెండింగ్ దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రూపొందించిన నూతన ఆర్.ఓ.ఆర్ ముసాయిదా బిల్లు 2024 పై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్సైట్ (డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు.సీసీఎల్ ఏ.తెలంగాణ.గావ్.ఇన్) ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ నెల 2 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ప్రజలు ఎవరైనా సరే తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చని అన్నారు. సలహాలు, సూచనలను ఈ మెయిల్ ద్వారా తెలుపవచ్చని సూచించారు. పోస్ట్ ద్వారా కూడా ‘ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001’ చిరునామాకు పంపించవచ్చని తెలిపారు. అనంతరం ఆయా మండలాల తహశీల్దార్లకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని, సీ.సీ.ఎల్.ఏ కమిషనర్ సూచనల మేరకు 10 రోజులుగా పెండింగ్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆర్డీవోలు రంగనాథచారి, రాథోడ్ రమేష్, ప్రభాకర్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.