రైతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం..!
– ఉమ్మడి మండల జడ్పిటిసి పడగల రాజేశ్వరరావు

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందినందుకు నిరసనగా గాంధీ జయంతి తర్వాత పార్టీలకు అతీతంగా రైతు ఉద్యమాన్ని చేపడతామని బారాస సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి పడగల రాజేశ్వరరావు, జిల్లా బీసీ నాయకుడు కలాలి సాయ గౌడ్, ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ఈ నెలాఖరు వరకు మిగిలిన రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం వల్ల సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వానికి గడువిస్తున్నామన్నారు. మంత్రి మాట నిలబెట్టుకుంటే రైతుల తరఫున ఎలాంటి ఆందోళన చేయమని, హామీ అమలు కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఖరీఫ్ పంటలు చేతికొస్తున్నప్పటికీ రైతు బంధు నిధులను ఇంతవరకు రైతులకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. మాటలు కోటలు దాటిన కాళ్లు గడప దాటడం లేదన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఎకరాన 15000/- చొప్పున ఖరీఫ్ రబ్బికి సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. గత భరసా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు నమ్మి ఓటు వేసి నందుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అలాగే రైతు భరోసా కింద పదిహేను వేలు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు చాకలింగం ఉప్పల్ వై గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు సంకి లింగం, తదితరులు పాల్గొన్నారు.