పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తీరని లోటు.
ప్రియమిత్రుడిని కోల్పోవడం వ్యక్తిగతంగా బాధాకరం. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పార్టీకి, తెలంగాణ రాజకీయాలకు తీరని లోటని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రియమిత్రుడిని కోల్పోవడం తనను వ్యక్తిగతంగా తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన వీడియో సందేశంలో గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు విద్యార్థి సంఘాలు, కుల సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుండి నడిపిన నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరని కొనియాడారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజాసేవకు అంకితమై పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేశారని తెలిపారు. జిల్లా అభివృద్ధి, రాజకీయ పరిణామాలపై తరచూ చర్చించుకునే ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.