పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేశ విగ్రహాల పంపిణీ.
వెంకటాద్రి టౌన్ షిప్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, సెప్టెంబర్ 13: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా వినాయక చవితి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో మట్టి గణేశ విగ్రహాలను బీజేపీ ఆద్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ జిల్లా కన్వీనర్ ఆదిమూల కరుణాకర్, పోచారం డివిజన్ కన్వీనర్ సత్యం గౌడ్ ఆదేశాల మేరకు పోచారం డివిజన్ కో-కన్వీనర్ ఏర్పుల రాజు-జయ ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడ-వెంకటాద్రి టౌన్షిప్లో స్థానికులకు ఉచితంగా మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపి) తో తయారు చేసిన గణేశ విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో నిమజ్జనం అనంతరం జలవనరుల్లో వ్యర్థాలు పేరుకుపోయే అవకాశం ఉందన్నారు. అలాగే విగ్రహాలకు వినియోగించే రసాయన రంగుల్లో సీసం, పాదరసం వంటి భారలోహాలు ఉండటం వల్ల నీరు కలుషితమై, జలచరాలకు తీవ్ర హాని కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మట్టి గణేశ విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.