గోధుమవాగు వంతెన మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని.
రవాణా సౌకర్యాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సమీపంలోని గోధుమవాగు వంతెన మరమ్మతు పనులను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు.కొత్తగూడెం-విజయవాడ జాతీయ రహదారిపై కొనసాగుతున్న మరమ్మతు పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణంలో తలెత్తిన లోపాల కారణంగా ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ఎమ్మెల్యే, నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం ఏమాత్రం సమంజసం కాదన్నారు. రవాణా సౌకర్యాలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని, తాత్కాలిక మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారి రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గోధుమవాగు వంతెన వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.