
అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ఆకట్టుకుంది.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక సమానత్వం, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాటికలు వంటి కళారూపాలు ప్రభావవంతమైన మాధ్యమాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన పోరాటం, రాజ్యాంగ విలువలను ప్రతిబింబించేలా కళాకారులు ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్చామి’ నాటికను ఆయన అభినందించారు. భూపాలపల్లి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ కృష్ణ కాలనీ మినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సింగరేణి కాలరీస్ కంపెనీ హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాటిక ప్రదర్శించారు. కార్యక్రమానికి జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, సేవ అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాటికను వీక్షించిన జీఎం మాట్లాడుతూ అంబేద్కర్ బాల్యం, విద్యాభ్యాసం, ఆయన ఎదుర్కొన్న సామాజిక వివక్ష, విద్య ద్వారా సాధించిన ఉన్నత స్థానం, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం, భారత రాజ్యాంగ రూపకల్పనలో పోషించిన కీలక పాత్రను కళాకారులు భావోద్వేగభరితంగా ఆవిష్కరించారని తెలిపారు. నాటిక ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలపై ఆలోచింపజేసిందన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజల్లో కళా, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఐఈడీ జ్యోతి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్సుందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి.మధుకర్ రెడ్డి, సీఎంఓఏఐ అధ్యక్షుడు నజీర్, ఎస్సీ, ఎస్టీ లైజన్ అధికారులు చంద్ర శేఖర్, భూక్యా మోహన్, వివిధ సంఘాల నాయకులు గడిపే చక్రపాణి, గుగులోత్ హేమ నాయక్, సత్యనారాయణ, ఉద్యోగులు, విద్యార్థులు, సేవ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.